పెనుగొలనులో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ నిర్వహణ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో ఆదివారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
1999 జూలై 26న కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ సైన్యంపై భారత సైన్యం సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ, దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమర జవాన్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, సాయిబాబా కమిటీ సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి వీర జవాన్ల త్యాగాలను స్మరించారు.
కార్యక్రమంలో సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలను అర్పించిన వీర జవాన్ల త్యాగాల వల్లే నేడు భారత ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని అన్నారు. వారి సేవలను ప్రతి భారతీయుడు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు.
సాయిబాబా సేవా కమిటీ ఆర్గనైజర్ ముక్కెర జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే దేశభక్తిని అలవర్చుకుని, దేశ సేవ పట్ల అంకితభావంతో ఎదగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, విద్యార్థులు, సాయిబాబా సేవా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.