పెనుగొలనులో ఘనంగా సినారె జయంతి వేడుకలు శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో నివాళులు.. సాహిత్య సేవలను స్మరించిన వక్తలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో బుధవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో భారతీయ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, ప్రముఖ కవి డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి (సినారె) జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సినారె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆర్గనైజర్ సుగ్గల హనుమంతరావు మాట్లాడుతూ, సినారె కేవలం గొప్ప కవి మాత్రమే కాకుండా పద్యాలు, గేయాలు, ముక్తక కావ్యాలు, వచన కవితలు, గద్య రచనలు, చలనచిత్ర గీతాలు, యాత్రా కథనాలు, సంగీత రూపకాలు, బుర్రకథలు, గజళ్లు, వ్యాసాలు, విమర్శన గ్రంథాలు, అనువాదాలతో తెలుగు సాహిత్యాన్ని విశేషంగా సుసంపన్నం చేశారని కొనియాడారు.
సాయిబాబా యూత్ కమిటీ అధ్యక్షుడు వూటుకూరు యజ్ఞకృష్ణ మాట్లాడుతూ, సినారె రచించిన విశ్వంభర, కర్పూర వసంతరాయలు, మంటలూ–మానవుడు, నాగార్జునసాగరం, తేజస్సు నా తపస్సు వంటి రచనలు సాహిత్యలోకంలో చిరస్థాయిగా నిలిచాయని తెలిపారు. ఆయన రచనలు ఇంగ్లీష్, ఫ్రెంచ్, సంస్కృతం, హిందీ, మలయాళం, ఉర్దూ, కన్నడ తదితర భాషల్లోకి అనువదించబడటం ఆయన ప్రతిభకు నిదర్శనమని పేర్కొన్నారు.
రామలింగేశ్వరస్వామి ఆలయ కమిటీ సభ్యుడు పంది హనుమంతరావు మాట్లాడుతూ, సినారెకు జ్ఞానపీఠ పురస్కారంతో పాటు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, పద్మశ్రీ, పద్మభూషణ్, నంది పురస్కారం, భారతీయ భాషా పరిషత్ పురస్కారం, అసాన్ పురస్కారం తదితర ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులు లభించాయని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ సభ్యులు, యూత్ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, సాహిత్యాభిమానులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.