పెనుగొలనులో ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలను ఆదివారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లచ్చన్న చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు బొలగాని కోటేశ్వరరావు మాట్లాడుతూ ఉత్తర కోస్తా కళింగ సీమ ఉద్దానం ప్రాంతంలోని నాటి గంజాం జిల్లా సోంపేట తాలూకా బారువా గ్రామంలో 1909 ఆగస్టు 16న సాధారణ గౌడ కుటుంబంలో చిట్టయ్య, రాజ్యమ్మ దంపతులకు ఎనిమిదో సంతానంగా గౌతు లచ్చన్న జన్మించారని తెలిపారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత "సర్దార్" అనే గౌరవాన్ని పొందిన గొప్ప నాయకుడిగా లచ్చన్న పేరు పొందారని పేర్కొన్నారు. వి.వి.గిరి, సుభాష్ చంద్రబోస్, ధర్మతేజ తదితర జాతీయ నాయకులతో కలిసి స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని అనేకసార్లు జైలుకు వెళ్లారని కొనియాడారు. ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లంఘన, క్విట్ ఇండియా ఉద్యమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారని వివరించారు.
రైతు సంఘం అధ్యక్షుడు మీనుగు కృష్ణ మాట్లాడుతూ స్వాతంత్ర్యం రాకముందే రాత్రి పాఠశాలలు నిర్వహించి బడుగు వర్గాల విద్యాభివృద్ధికి లచ్చన్న కృషి చేశారని తెలిపారు. హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పించిన గొప్ప మానవతావాదిగా ఆయన గుర్తింపు పొందారని అన్నారు. అనేక కిసాన్ ఉద్యమాలకు నాయకత్వం వహించి జమీందారులపై పోరాటం చేశారని వివరించారు. స్వాతంత్ర్యం అనంతరం ఆంధ్ర రాష్ట్రంలో ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారని తెలిపారు.
కాన్వెంట్ ప్రిన్సిపాల్ తోట నాగరాజు మాట్లాడుతూ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో దానిని వ్యతిరేకిస్తూ చరణ్ సింగ్, జయప్రకాష్ నారాయణతో కలిసి దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాల్లో పాల్గొన్నారని తెలిపారు. జీవితాంతం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన గౌతు లచ్చన్న 2006 ఏప్రిల్ 19న మరణించారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ జి. నరసింహారావు, టీడీపీ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వరరావు, బొర్రా శేషగిరిరావు, మువ్వా వీరభద్రరావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.