పెనుగొలనులో కాసు బ్రహ్మానందరెడ్డి 117వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలనులో మంగళవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి 117వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సభలో ఉపాధ్యాయురాలు కే. లింగమ్మ మాట్లాడుతూ, కాసు బ్రహ్మానందరెడ్డి 1909 జూలై 28న గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని తూబాడు గ్రామంలో జన్మించారని తెలిపారు. స్వాతంత్య్ర సమరంలో సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని జైలు శిక్ష అనుభవించారని గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, మహారాష్ట్ర గవర్నర్గా, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా పలు కీలక బాధ్యతలు నిర్వర్తించి ప్రజాసేవకు విశేష కృషి చేశారని కొనియాడారు.
మహిళా కమిటీ సభ్యురాలు దేవర అంజలి మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేశారని తెలిపారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ సభ్యులు, గ్రామస్తులు, అంగన్వాడీ చిన్నారులు పాల్గొన్నారు.