పెనుగొలనులో వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు
పెనుగొలనులో వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ఆషాఢ మాసం ఆదివారం సందర్భంగా శాకాంబరి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ గోవిందమ్మ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి, స్వామివారి శిష్యుడు సిద్ధయ్య మూలవిరాట్ విగ్రహాలను వివిధ రకాల కాయగూరలు, ఆకుకూరలతో ప్రత్యేకంగా అలంకరించారు. టమాట, బెండకాయ, వంకాయ, క్యారెట్, దొండకాయ, చేమదుంప, పచ్చిమిరపకాయ, గోరుచిక్కుడు, అరటికాయ తదితర కాయగూరలతో పాటు తోటకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలను దండలుగా కట్టి స్వామివారిని, అమ్మవారిని కనువిందుగా అలంకరించారు.
ఉత్సవాల్లో భాగంగా ముందుగా స్వామివారికి, అమ్మవారికి అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ కార్యదర్శి రంగు సత్యనారాయణ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
శాకాంబరి అలంకరణలో దర్శనమిచ్చిన స్వామివారిని, అమ్మవారిని దర్శించుకునేందుకు పెనుగొలను గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల రాకతో సందడిగా మారింది.