పెట్రో, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి: సీపీఐ(ఎంఎల్) లిబరేషన్
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ కమిటీ సమావేశం దుర్గం పుల్లారావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హరినాథ్ మాట్లాడుతూ పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
లోక్సభ ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక భారాలు మోపి మోసం చేసిందని విమర్శించారు. "మన్ కీ బాత్" కార్యక్రమంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల భారం తగ్గిస్తామని ప్రజలు ఆశించినప్పటికీ నిరాశే ఎదురైందన్నారు.
రాష్ట్రంలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడులో ప్రజా సమస్యల కంటే రాజకీయ విమర్శలకే ప్రాధాన్యం ఇచ్చారని హరినాథ్ ఆరోపించారు. మహిళా బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా, పార్టీ తరఫున 33 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులను రద్దు చేసి ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం జూన్ 1 నుంచి 7 వరకు ప్రజా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే జూన్ 9న రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
జూన్ 6, 7 తేదీల్లో విస్సన్నపేటలో జరిగే సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కమిటీ సమావేశాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వేముల బక్కయ్య, చాట్ల బాబురావు, పి. గోవిందు, భవాని, తిరుపతిరావు, కలపాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.