నరసింహారావుపాలెంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
చాట్రాయి, జూలై 15: చాట్రాయి మండలంలోని నరసింహారావుపాలెం గ్రామంలో బుధవారం మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ ఆధ్వర్యంలో 'పొలం పిలుస్తుంది' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్నీనో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని, వర్షపాతం పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు.
పంట నష్టాల నుంచి ఆర్థిక భద్రత కల్పించే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) కింద రైతులు తప్పనిసరిగా పంటల బీమా చేయించుకోవాలని సూచించారు. రుణం తీసుకోని రైతులు వరి పంటకు ఎకరానికి రూ.840, మినుములకు రూ.300, ప్రత్తికి రూ.1,900, నిమ్మకు రూ.2,500 ప్రీమియం చెల్లిస్తే బీమా సౌకర్యం వర్తిస్తుందని వివరించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలకు నష్టం సంభవించినప్పుడు ఈ బీమా రైతులకు ఆర్థికంగా ఎంతో తోడ్పడుతుందని తెలిపారు.
వ్యవసాయ అవసరాలకు సంబంధించిన యూరియా, డీఏపీ ఎరువుల నిల్వలు పీఏసీఎస్ సంఘాలు, రిటైల్ ఎరువుల దుకాణాల్లో సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. రైతులు అవసరమైన ఎరువులను అధికారిక విక్రయ కేంద్రాల నుంచే కొనుగోలు చేయాలని సూచించారు. అలాగే వ్యవసాయ శాఖ అందిస్తున్న డిజిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, ఏపీఏఐఎంఎస్ యాప్, ఏపీఎఫ్ఆర్ సేవల ద్వారా ఎరువుల లభ్యత, ఇతర వ్యవసాయ సమాచారాన్ని సులభంగా పొందవచ్చని రైతులకు అవగాహన కల్పించారు.