ఓటర్ సమగ్ర జాబితా సర్వేలో నిజాయితీగా విధులు నిర్వహించిన బీఎల్ఓ శ్రీలేఖకు అభినందనలు
ఏలూరు జిల్లా విస్సన్నపేట మండలం కలగర లక్ష్మీపురం పోలింగ్ స్టేషన్ నెం.158లో బీఎల్ఓగా విధులు నిర్వహిస్తున్న శ్రీలేఖ, మండల తహసీల్దార్ లక్ష్మీ, ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించారు.
సర్వే సందర్భంగా ఏలూరు జిల్లా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బుర్రి శ్రీకర్, సుమలత పేర్లు విస్సన్నపేట మండలం కలగర లక్ష్మీపురం పోలింగ్ స్టేషన్ నెం.158తో పాటు చాట్రాయి మండలం చనుబండ పోలింగ్ స్టేషన్ నెం.4లో కూడా నమోదై ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సంబంధిత వారిని ఫోన్ ద్వారా సంప్రదించి, అవసరమైన ప్రక్రియ పూర్తి చేసి, లక్ష్మీపురం పోలింగ్ స్టేషన్ నుంచి ఓటర్ల పేర్లను తొలగించి, చాట్రాయి మండలం చనుబండ పోలింగ్ స్టేషన్ నెం.4లో మాత్రమే కొనసాగించేలా చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా బుర్రి శ్రీకర్ మాట్లాడుతూ, ఓటరు జాబితాలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా నిజాయితీతో విధులు నిర్వహించిన బీఎల్ఓ శ్రీలేఖను ప్రత్యేకంగా అభినందించారు. బీఎల్ఓలకు సహాయకులుగా ఉండాల్సిన అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పూర్తిస్థాయిలో సహకరించని పరిస్థితుల్లోనూ, నిర్ణీత గడువులో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి ఆమె కృషి చేశారని పేర్కొన్నారు. ఇదే విధంగా ప్రతి బీఎల్ఓ బాధ్యతాయుతంగా, నిష్పక్షపాతంగా పనిచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు వెల్ది వెంకటరావు, సీపీఎం మహిళా నాయకురాలు బుర్రి మేరీకుమారి, పంచాయతీ వీఆర్ఏ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.