నీట్ లీకేజీపై కేంద్రాన్ని నిలదీయాలి: జులై 20న ‘చలో పార్లమెంట్’ విజయవంతం చేయండి – సీపీఐ(ఎంఎల్) లిబరేషన్
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హరినాథ్ మాట్లాడుతూ, నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 21 రోజులుగా విద్యార్థి నాయకులు నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు.
ఎన్డీఏ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జులై 20న చేపట్టనున్న ‘చలో పార్లమెంట్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థి సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, అభ్యుదయ శక్తులు పెద్దఎత్తున పాల్గొని తమ నిరసన గళాన్ని వినిపించాలని కోరారు.
ఎండలో ఎండి, వర్షంలో తడుస్తూ విద్యార్థి నాయకులు దీక్షలు కొనసాగిస్తున్నా, కనీసం టెంట్లు ఏర్పాటు చేసుకునేందుకు కూడా అనుమతించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. గాంధేయ మార్గంలో శాంతియుతంగా ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్న సోనం వాంగ్చుక్, ఐసా విద్యార్థి నాయకురాలు నేహా సహా మరికొందరి ఆరోగ్య పరిస్థితి విషమించిందని, వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడే పరిస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్చలు ప్రారంభించి సమస్యకు పరిష్కారం చూపాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు చొరవ చూపాలని హరినాథ్ విజ్ఞప్తి చేశారు.