పెట్రోల్ ధరల పెంపుతో సామాన్యుల్లో ఆందోళన
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రామసముద్రంలో నిన్నటి వరకు రూ.110.13గా ఉన్న పెట్రోల్ ధర శుక్రవారం నాటికి రూ.113.41కు చేరగా, డీజిల్ ధర కూడా గణనీయంగా పెరిగింది. ఉదయం నుంచే కొత్త ధరలు అమల్లోకి రావడంతో వాహనదారులు, రైతులు, ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంధన ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నేత రెడ్డిసాహెబ్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పెట్రోలు, డీజిల్ ధరల పెంపుతో కేంద్ర ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల వల్ల సామాన్య ప్రజలపై మోయలేని భారం పడుతోందన్నారు. “చమురు వినియోగం తగ్గించాలంటూ ప్రజలకు ఉపదేశాలు చేస్తూనే, మరోవైపు ధరలను పెంచడం ఎంతవరకు సమంజసం?” అని ప్రధాని మోదీని ప్రశ్నించారు. వెంటనే ధరల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించి ప్రజలకు ఊరట కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.