పిఠాపురం.. వాటర్ బాటిల్కు అదనంగా రూ.7 వసూలు
వ్యాపారికి కన్జ్యూమర్ ఫోరం షాక్.. ఏకంగా రూ.7 లక్షల జరిమానా
కాకినాడ జిల్లా: వాటర్ బాటిల్పై అదనంగా రూ.7 వసూలు చేసిన వ్యాపారికి వినియోగదారుల కమిషన్ భారీ షాక్ ఇచ్చింది. ఏకంగా రూ.7 లక్షల జరిమానా విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.
పిఠాపురానికి చెందిన డి. వెంకటేశ్వరరావు ఈ ఏడాది ఫిబ్రవరి 22న అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్లారు. సత్యగిరిపై ఉన్న సత్యదేవ ఫ్యాన్సీ, కొబ్బరికాయలు, కూల్డ్రింక్స్ దుకాణంలో వాటర్ బాటిల్ కొనుగోలు చేశారు. బాటిల్పై గరిష్ట చిల్లర ధర రూ.18గా ఉండగా.. వ్యాపారి రూ.25 వసూలు చేశాడు.
దీంతో అదనంగా రూ.7 ఎందుకు తీసుకుంటున్నారని భక్తుడు ప్రశ్నించారు. అనంతరం కొనుగోలుకు సంబంధించిన ఆధారాలతో అన్నవరం ఆలయ అధికారులకు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ స్పందన లేకపోవడంతో ఆలయ యంత్రాంగం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ న్యాయం కోసం కాకినాడ జిల్లా వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు.
ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కమిషన్ సభ్యులు.. వ్యాపారి అదనపు ధర వసూలు చేసిన అంశాన్ని పరిశీలించి రూ.7 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. చిన్న మొత్తంలో అదనంగా వసూలు చేసినా.. వినియోగదారుల హక్కులను ఉల్లంఘిస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఈ తీర్పు స్పష్టం చేసింది.