పల్నాడు చేపల చెరువుల్లో చికెన్ వ్యర్థాలు.. కలకలం
చేపల మేత పేరుతో కోళ్ల వ్యర్థాల వినియోగం? సమగ్ర విచారణకు డిమాండ్
పల్నాడు జిల్లా: చేపలు ఆరోగ్యానికి మంచివని భావించి కొనుగోలు చేసే ప్రజల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలోని కొన్ని చేపల చెరువుల్లో కోళ్ల మాంసం వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి ప్రైవేట్ వాహనాల ద్వారా కోళ్ల వ్యర్థాలను తీసుకొచ్చి కొన్ని చెరువుల్లో వేస్తున్నట్లు సమాచారం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సత్తెనపల్లి, ముప్పాళ్ల, పెదకూరపాడు, అమరావతి, నరసరావుపేట, చిలకలూరిపేట పరిసర ప్రాంతాల్లో ఈ విధానం కొనసాగుతోందనే ఆరోపణలు గతంలోనూ వినిపించాయి.
చికెన్ వ్యర్థాలను చేపల మేతగా వినియోగించడం వల్ల చెరువుల్లో నీటి కాలుష్యం, దుర్వాసన, పర్యావరణ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పల్నాడు జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చేపల రైతులు, స్థానికులు కోరుతున్నారు.
ఇదిలా ఉండగా, మత్స్యశాఖ అధికారులపై కూడా లంచం ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. ఆరోపణలపై సంబంధిత శాఖ అధికారులు పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.