పంచాయతీరాజ్ శాఖలో పారదర్శకతకు ప్రత్యేక పబ్లిక్ డ్యాష్బోర్డ్
పంచాయతీరాజ్ శాఖలో పారదర్శకతకు ప్రత్యేక పబ్లిక్ డ్యాష్బోర్డ్ : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ పనితీరులో మరింత పారదర్శకత తీసుకురావడానికి ప్రత్యేక పబ్లిక్ డ్యాష్బోర్డ్ ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు శాఖ కార్యకలాపాలు, అభివృద్ధి పనుల పురోగతి స్పష్టంగా కనిపించేలా వ్యవస్థ రూపొందించాలని సూచించారు.
స్వచ్ఛ రథం నమూనాలో గ్రీన్ షాప్స్ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి పరిశుభ్రతపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని తెలిపారు. గ్రామాల్లో వ్యర్థాల నిర్వహణను సమర్థంగా అమలు చేసి శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
అలాగే గ్రామీణ రోడ్ల నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి కావాలని అధికారులకు స్పష్టం చేశారు. పనుల్లో ఆలస్యం లేకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని పేర్కొన్నారు.
పంచాయతీరాజ్ శాఖ సమీక్ష సమావేశంలో స్వర్ణ పంచాయతీ పోర్టల్, స్వమిత్వ కార్యక్రమం, గ్రామీణ రోడ్ల పురోగతి, ఘన వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.