పొగాకు రైతుల ఆందోళన.. జాతీయ రహదారిపై రాస్తారోకో, అరెస్టులు
పొగాకు రైతుల ఆందోళన.. జాతీయ రహదారిపై రాస్తారోకో, అరెస్టులు
ఒంగోలు: పొగాకు రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు సమీపంలోని టంగుటూరు టోల్ప్లాజా వద్ద సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పొగాకు రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నిరసనకు దిగిన రైతులను, రైతు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ, పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రూ.1,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ ఎస్టీసీ ద్వారా పొగాకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.
ముఖ్యమంత్రి కిలోకు రూ.200 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవద్దని సూచించినప్పటికీ అమలు కాలేదని విమర్శించారు. 'నో బిడ్', 'లో బిడ్' సమస్యలు నివారించేందుకు సమీక్షలు నిర్వహించినా ప్రైవేట్ కంపెనీలు తమ ఇష్టానుసారంగా కొనుగోళ్లు చేశాయని ఆరోపించారు. దీంతో ఒక్కో బారెన్కు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు నష్టం వాటిల్లుతోందని తెలిపారు.
95 మిలియన్ కిలోల ఇండెంట్ పొందిన ఐటీసీ వంటి కంపెనీలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం కంపెనీలపై ఒత్తిడి తీసుకురాకుండా వారికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ప్రైవేట్ కంపెనీల ద్వారా సగటున కిలోకు రూ.250 చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, లేకపోతే రూ.1,000 కోట్లతో ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా వెంటనే పొగాకు కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పొగాకు రైతుల గిట్టుబాటు ధర సమస్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదనలకే పరిమితం కాకుండా తక్షణ కార్యాచరణ చేపట్టాలని రైతు నాయకులు కోరారు.