పొగాకు రైతులకు ఊరట.. మూడేళ్లపాటు వడ్డీ లేని రుణం: ఎంపీ పుట్టా మహేష్ కుమార్
ఏలూరు, జూలై 30: అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పొగాకు ధరలు తగ్గి ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఊరట కల్పించేలా కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ఉన్న ఆయన గురువారం నిర్వహించిన పొగాకు బోర్డు సమావేశంలో వర్చువల్గా పాల్గొని రైతుల సమస్యలను బోర్డు దృష్టికి తీసుకెళ్లారు.
సమావేశం అనంతరం విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ, బ్యారెల్కు రూ.50 వేల చొప్పున మూడేళ్లపాటు వడ్డీ లేని రుణం అందించేందుకు పొగాకు బోర్డు అంగీకరించిందని వెల్లడించారు. ముఖ్యంగా తక్కువ నాణ్యత (లో గ్రేడ్) పొగాకు పండించిన రైతులకు ఈ నిర్ణయం కొంత మేర ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు.
పొగాకు రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, రైతుల ఇబ్బందులను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి పలుమార్లు కేంద్ర వాణిజ్య మంత్రి, పొగాకు బోర్డు ఛైర్మన్, సభ్యులతో చర్చించినట్లు ఎంపీ వివరించారు.
ఈ ఏడాది అంతర్జాతీయ పరిణామాల కారణంగా పొగాకు ధరలు గణనీయంగా పడిపోయాయని, అనుమతించిన పరిమితికి మించి సాగు విస్తీర్ణం పెరగడం కూడా పరిస్థితిని మరింత క్లిష్టం చేసిందన్నారు. తక్కువ నాణ్యత పొగాకును కొనుగోలు చేసేందుకు కంపెనీలు ముందుకు రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
రైతులకు గిట్టుబాటు ధర లభించేలా అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, గత రెండేళ్లలో కిలో పొగాకుకు గరిష్టంగా రూ.470 వరకు ధర వచ్చేలా చర్యలు తీసుకున్నామని, ఈ ఏడాది కూడా కనీసం రూ.300కు పైగా ధర లభించేలా నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు.
రైతులు ఆర్థికంగా బలపడటమే ప్రభుత్వ లక్ష్యమని, వారి ప్రయోజనాల కోసం భవిష్యత్తులోనూ అవసరమైన చర్యలు కొనసాగుతాయని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు.