పోలవరంలో ఘనంగా బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
పోలవరంలో ఘనంగా బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన జెండా దిమ్మపై పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమం బీజేపీ జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు చాగంటి వాసుదేవరావు ఆధ్వర్యంలో జరిగింది.
ఈ వేడుకలకు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు శ్రీకర్ బుర్రి, బీజేపీ సీనియర్ నాయకులు గడ్డం సంజీవరెడ్డి, కనతమరెడ్డి ముత్తా రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా శ్రీకర్ బుర్రి మాట్లాడుతూ, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన జనసంఘ్ పార్టీ నుంచి ప్రారంభమైన ప్రయాణం, అనంతరం దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ప్రతిపాదించిన అంత్యోదయ సిద్ధాంతంతో బలపడిందన్నారు. 1980లో అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెంది దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగిందని వివరించారు.
కేవలం రెండు పార్లమెంట్ సీట్లతో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం, 1996లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో కొత్త దశలోకి ప్రవేశించిందని, అనంతరం 1998 నుంచి 2004 వరకు ఆయన నాయకత్వాన్ని దేశ ప్రజలు విశేషంగా ఆదరించారని తెలిపారు.
అలాగే 2014లో నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగిందని, ఆర్టికల్ 370 రద్దు వంటి కీలక నిర్ణయాలతో దేశ గౌరవాన్ని పెంచిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అట్టడుగు ప్రజలకు చేరుతున్నాయని వివరించారు.
జెండా దిమ్మ నిర్మాణానికి స్థలం ఇచ్చి సహకరించిన ఆర్ఎస్ఎస్ నాయకులు గోవిందరాజు, సుజాత దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, ఉపాధి హామీ కూలీలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.