పోటెత్తుతున్న కృష్ణమ్మ.. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం ప్రారంభం
హైదరాబాద్, జూలై 30: ఎల్నినో ప్రభావంతో రెండు నెలలుగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న వేళ కృష్ణానది జలకళను సంతరించుకుంటోంది. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం ప్రారంభమైంది.
కృష్ణా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం జూరాలకు సుమారు 32 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుండగా, అధికారులు క్రస్ట్ గేట్లు ఎత్తి దాదాపు 30,700 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీరంతా శ్రీశైలం జలాశయానికి చేరుతోంది.
అదే సమయంలో ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి 80 వేల క్యూసెక్కులు, నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 89,520 క్యూసెక్కుల నీటిని జూరాలకు విడుదల చేస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 18,349 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదవుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 823.70 అడుగులకు చేరుకుంది.
ఇక గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులకు కూడా వరద నీరు చేరుతుండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎగువ ప్రాంతాలు, స్థానిక పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు క్రమంగా నిండుతున్నాయి.
రానున్న నాలుగు రోజుల్లో కృష్ణానదిలో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున, దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ అధికారులు సూచించారు.