పోతనపల్లి పెద్ద తండాలో ఎక్సైజ్ దాడులు
పోతనపల్లి పెద్ద తండాలో ఎక్సైజ్ దాడులు: నాటు సారా తయారీపై కేసు నమోదు
నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటు సారా నిర్మూలనపై అధికారుల కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. ఏలూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ బి.శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ కే.నాగ ప్రభు కుమార్, జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఎ.అవులయ్య ఆదేశాల మేరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవోదయం 2.0 కార్యక్రమం కింద చాట్రాయి మండలం పోతనపల్లి పెద్ద తండా గ్రామంలో ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 50 లీటర్ల బెల్లపు ఊటను అధికారులు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో అదే గ్రామానికి చెందిన బాణావతు ధనలక్ష్మి భర్త చిన్న వెంకట సీతారామయ్యపై కేసు నమోదు చేసినట్లు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ.మస్తానయ్య వెల్లడించారు. అలాగే నూజివీడు ప్రొహిబిషన్ పరిధిలోని ఆగిరిపల్లి, నూజివీడు, ముసునూరు, చాట్రాయి మండలాల్లో బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై, నాటు సారా తయారీ, విక్రయం, నిల్వ వంటి నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాటు సారా తయారీకి ఉపయోగించే బెల్లం సరఫరా చేసే వ్యాపారులు, బెల్లపు ఊట నిల్వ ఉంచే భూ యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఎవరైనా ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించాలనుకుంటే 9440902462 నంబర్కు ఫోన్ చేయవచ్చని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ తెలిపారు.