ప్రైవేట్ బస్సుల అగ్ని ప్రమాదాలపై కట్టుదిట్టమైన తనిఖీలు
ప్రైవేట్ బస్సుల అగ్ని ప్రమాదాలపై కట్టుదిట్టమైన తనిఖీలు – తిరువూరు చెక్పోస్ట్ వద్ద ఫైర్ సిబ్బంది అలర్ట్
తిరువూరు: ఇటీవల వరుసగా చోటుచేసుకున్న ప్రైవేట్ బస్సుల అగ్ని ప్రమాదాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై కఠిన ఆదేశాలు జారీ చేయడంతో ఫైర్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ప్రమాదాలను ముందుగానే నివారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా చెక్పోస్టుల వద్ద విస్తృత స్థాయిలో తనిఖీలు చేపడుతున్నారు.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్–తెలంగాణ సరిహద్దులోని తిరువూరు చెక్పోస్ట్ వద్ద ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఆదివారం తెల్లవారుజామున 6 గంటల నుంచే తనిఖీలు ప్రారంభించారు. రాత్రి, పగలు తేడా లేకుండా నిరంతరం వాహనాల పరిశీలన కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు.
ప్రత్యేకంగా ప్రైవేట్ బస్సులపై దృష్టి సారించిన సిబ్బంది, ప్రతి బస్సును ఆపి సమగ్రంగా తనిఖీ చేస్తున్నారు. బస్సుల రిజిస్ట్రేషన్ పత్రాలు, ఫిట్నెస్ సర్టిఫికేట్లు, డ్రైవర్ల లైసెన్సులను పరిశీలిస్తూ, వాహనంలో సాంకేతిక లోపాలపై సవివరంగా ఆరా తీస్తున్నారు.
ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ పరికరాలు ఉన్నాయా, అవి సక్రమంగా పనిచేస్తున్నాయా అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇంధన లీకేజీలు, ఎలక్ట్రికల్ లోపాలు వంటి అగ్ని ప్రమాదాలకు దారితీసే అంశాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
నిబంధనలు పాటించని వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, ప్రజల ప్రాణ భద్రతే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రయాణికులు కూడా అప్రమత్తంగా ఉండి భద్రతా నిబంధనలు పాటించేందుకు సహకరించాలని సూచించారు.
ఈ తనిఖీల్లో ఆర్. బుచ్చిబాబు (లీడింగ్ ఫైర్మ్యాన్), ఎస్. తిరుపతి వెంకయ్య (ఫైర్మ్యాన్), వై. సత్యనారాయణ (హోమ్ గార్డ్), డి. రాంబాబు (ఫైర్ ఆఫీసర్) పాల్గొని విధులు నిర్వహించారు.