స్థానిక ఎన్నికల్లో నూటికి నూరు శాతం విజయం సాధించాలి: కొలుసు పార్థసారధి
స్థానిక ఎన్నికల్లో నూటికి నూరు శాతం విజయం సాధించాలి: కొలుసు పార్థసారధి
ఆగిరిపల్లి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని 25 గ్రామాల్లోనూ తెలుగుదేశం పార్టీ విజయం సాధించేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార-పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి పిలుపునిచ్చారు. ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో నిర్వహించిన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మండలంలో ఇప్పటికే కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని, ప్రజలకు ఇచ్చిన హామీల అమలే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ.10 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిందని ఆరోపించిన ఆయన, ఆ అప్పులను తీర్చుకుంటూనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు వెనుకడుగు వేయగా, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై విశ్వాసంతో రుణాల మంజూరు జరుగుతోందని అన్నారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి ప్రాజెక్టులను తిరిగి గాడిలో పెడుతున్నామని చెప్పారు.
2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి జాతికి అంకితం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యమున్న 36 ప్రాజెక్టుల్లో చింతలపూడి ఎత్తిపోతల పథకానికి ఏడో స్థానం కల్పించినట్లు వెల్లడించారు.
గత ప్రభుత్వం అభివృద్ధిని పక్కనపెట్టి సంక్షేమ బటన్లకే పరిమితమైందని విమర్శించిన మంత్రి, యువతకు ఉపాధి కల్పించాలంటే పరిశ్రమల స్థాపన తప్పనిసరని అన్నారు. ప్రతి ఏడాది లక్షలాది మంది విద్యార్థులు చదువులు పూర్తి చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే సరిపోవని, ప్రైవేటు పరిశ్రమల ఏర్పాటుకు అందరూ సహకరించాలని కోరారు.
ఈదర గ్రామానికి చెందిన ఏసుపాదం మాట్లాడుతూ గత 40 ఏళ్లలో జరగని అభివృద్ధి గత రెండు సంవత్సరాల్లో జరిగిందని తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.
తోటపల్లి గ్రామస్థులు స్మశానవాటిక అభివృద్ధి, తాగునీటి సౌకర్యం, డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరగా, వాటిని త్వరలో పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
వివిధ సామాజిక వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న మంత్రి, గౌడలకు రెస్టారెంట్లలో 10 శాతం రిజర్వేషన్ కల్పించామని, వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. నాయి బ్రాహ్మణులు, ఇతర చేతివృత్తిదారులకు కూడా ఆర్థిక చేయూత అందించి వారి అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పడుతోందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.