ప్రభుత్వ భవనాల స్థలాల ఆక్రమణపై పరిశీలన
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ శివారు సూరంపాలెంలో వెల్నెస్ సెంటర్, అంగన్వాడీ భవనాల కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైందని నూజివీడు నియోజకవర్గం ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో చనుబండ-2 సచివాలయ అధికారులు కే. శాంతి (ఎంఎల్హెచ్పీ), ఎం. కోటి (డీఏ), ఆర్. బాబురావు (డబ్ల్యూఈఏ) సూరంపాలెంలో సంబంధిత స్థలాన్ని పరిశీలించారు.
వెల్నెస్ సెంటర్ పక్కన నిర్మాణంలో ఉన్న బాత్రూమ్ వెనుక భాగంలో వరల గోతిని తవ్వించారు. వెల్నెస్ సెంటర్, అంగన్వాడీ భవనాలు నిర్మించిన ప్రభుత్వ స్థలం చుట్టుపక్కల కూడా ఆక్రమణకు గురైనట్లు గుర్తించినట్లు నక్కా రాము తెలిపారు.
ప్రభుత్వ భవనాల కోసం కేటాయించిన స్థలాన్ని మండల రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించి, ఆక్రమణకు గురైనట్లు నిర్ధారణ అయితే ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించి, వెల్నెస్ సెంటర్, అంగన్వాడీతో పాటు భవిష్యత్లో వైద్య, ప్రజా అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని నక్కా రాము అధికారులను కోరారు.