పెనుగొలనులో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో గురువారం విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణపతి పూజ పందిరి వద్ద వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రపంచ తొలి వాస్తు శిల్పి, దేవశిల్పి విశ్వకర్మ భగవానుడి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భగవానుడి చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చేతివృత్తుల కళాకారులు పొనుగుపాటి పెద్ద వెంకటేశ్వర్లు, కొండపల్లి రామాచారిలను జ్ఞాపికలు అందజేసి నూతన వస్త్రాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ నిర్వాహకుడు రంగు సత్యనారాయణ మాట్లాడుతూ హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మను విశ్వాన్ని నిర్మించిన పరమ పవిత్రమైన దేవశిల్పిగా పేర్కొంటారని తెలిపారు. బ్రహ్మాండంలోని సమస్త నిర్మాణాలు, అద్భుత కట్టడాలకు విశ్వకర్మ మూలకర్తగా పురాణాల్లో ప్రస్తావన ఉందన్నారు. దేవతల నివాసమైన స్వర్గలోకం, శ్రీకృష్ణుడి ద్వారకా నగరం, రావణుడి లంకా నగరం, పాండవుల రాజధాని ఇంద్రప్రస్థ వంటి భవ్య నగరాలను విశ్వకర్మ నిర్మించినట్లు పురాణాల్లో పేర్కొన్నారని వివరించారు. అనంతరం నిర్వాహక కమిటీ సభ్యులు భక్తులకు వివిధ రకాల ప్రసాదాలు, పానకం పంపిణీ చేశారు. కార్యక్రమంలో గణపతి కమిటీ సభ్యులు మీనుగు నరసింహ దంపతులు, శీలం కృష్ణారెడ్డి, వూటుకూరు యజ్ఞ కృష్ణ, మహిళా కమిటీ సభ్యులు, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.