ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన
ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన పులిని కాపాడితే.. ప్రకృతిని కాపాడినట్టే : డీఎఫ్ఓ సందీప్ రెడ్డి
ఏలూరు: అటవీ పర్యావరణ సమతుల్యతను కాపాడే కీలక జీవి పులి అని జిల్లా అటవీ శాఖాధికారి సందీప్ రెడ్డి అన్నారు. ప్రపంచ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు మండలం కొప్పాక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం "పర్యావరణ సమతుల్యత – పులుల సంరక్షణ" అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందీప్ రెడ్డి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణలో పులులు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. పులుల సంరక్షణ అవసరాన్ని ప్రపంచానికి తెలియజేయడం, వాటి సంఖ్యను పెంపొందించడం, సహజ నివాసాలను రక్షించడం ప్రపంచ పులుల దినోత్సవం ప్రధాన ఉద్దేశమని వివరించారు.
2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగిన పులుల సదస్సులో 13 దేశాలు కలిసి ప్రతి సంవత్సరం జూలై 29ను ప్రపంచ పులుల దినోత్సవంగా ప్రకటించినట్లు తెలిపారు. పులి భారతదేశ జాతీయ జంతువు మాత్రమే కాకుండా, ఆహార గొలుసులో అగ్రస్థానంలో ఉండే మృగంగా అడవుల్లో జీవవైవిధ్య సమతుల్యతను కాపాడుతుందని చెప్పారు. పులులు ఉన్న అడవులు ఆరోగ్యకరమైన పర్యావరణానికి సూచికలని పేర్కొన్నారు.
"పులిని కాపాడితే – ప్రకృతిని కాపాడినట్టే" అనే సందేశంతో ఈ ఏడాది ప్రపంచ పులుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, 2026 నినాదం "స్థానిక గిరిజనులు, స్థానిక ప్రజలను భాగస్వాములను చేస్తూ పులుల భవిష్యత్తును సురక్షితం చేయడం" అని వివరించారు.
ఈ సందర్భంగా అటవీ అధికారులు పులుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, అడవి జీవుల ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థుల్లో చైతన్యం పెంపొందించేందుకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
కార్యక్రమంలో అటవీ శాఖాధికారులు కె.ఎస్.వి. హరి గోపాల్, రామతులసి, సుజాత, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం. రామకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.