ప్రతి పౌరుడి ఆరోగ్య సమాచారాన్ని ఒకే వేదికపై అందుబాటులో-జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి శ్రీకారం చుట్టారు గురువారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) అమలులో మోడల్ డిస్ట్రిక్ట్ గా ఎంపికైన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధ్యక్షతన జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆరోగ్య రంగాన్ని పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయడం, ప్రతి పౌరుడి ఆరోగ్య సమాచారాన్ని ఒకే వేదికపై అందుబాటులో ఉంచడం ABDM ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ (HFR) మరియు హెల్త్ ప్రొఫెషనల్ రిజిస్ట్రీ (HPR) నమోదులను వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్లు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ల్యాబొరేటరీలు, ఫార్మసీలు మరియు వైద్య నిపుణులందరూ ఈ డిజిటల్ ప్లాట్ఫారమ్లో నమోదు కావాల్సి ఉంటుందని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సంస్థలు మరియు ఆరోగ్య సిబ్బంది తప్పనిసరిగా HFR, HPR నమోదులు పూర్తి చేయాలని సూచించారు. వైద్యులచే జారీ చేయబడే డిజిటల్ ప్రిస్క్రిప్షన్లు, ఆరోగ్య రికార్డుల డిజిటల్ నిర్వహణ ద్వారా ప్రజలకు మెరుగైన, పారదర్శకమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. ABDM అమలును పర్యవేక్షించేందుకు జిల్లాలో ప్రత్యేక కమిటీలు, ఫీల్డ్ బృందాలు ఏర్పాటు చేయబడినట్లు కలెక్టర్ తెలిపారు. వచ్చే రెండు వారాల్లో జిల్లాలోని అన్ని అర్హత కలిగిన ఆరోగ్య సంస్థలు, వైద్య నిపుణుల నమోదులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమం దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ఆరోగ్య సంస్కరణల్లో ఒకటిగా నిలుస్తుందని, యాదాద్రి భువనగిరి జిల్లాను రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.ABDM ద్వారా పౌరుల ఆరోగ్య రికార్డులు సురక్షితంగా, సులభంగా అందుబాటులో ఉండే డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ ఏర్పడుతుందని తెలిపారు.ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) కింద ప్రతి పౌరునికి ABHA ID రూపొందించడం ద్వారా వారి ఆరోగ్య రికార్డులను డిజిటల్ రూపంలో అనుసంధానం చేయవచ్చు. రోగి అనుమతితో దేశంలోని ఏ ప్రభుత్వ లేదా ప్రైవేటు ఏబీడీఎం(ABDM)-నమోదిత ఆసుపత్రిలోనైనా గత వైద్య చరిత్ర, పరీక్షా నివేదికలు, ప్రిస్క్రిప్షన్లు మరియు ఇతర ఆరోగ్య వివరాలను పరిశీలించి, వేగవంతమైన మరియు నాణ్యమైన వైద్య సేవలు అందించవచ్చు. దీంతో కాగితపు రికార్డుల అవసరం తగ్గి, అత్యవసర పరిస్థితుల్లో కూడా చికిత్స మరింత సమర్థవంతంగా అందుతుంది. రోగి అనుమతి లేకుండా ఆరోగ్య వివరాలను ఎవరూ చూడలేరు; గోప్యతకు పూర్తి రక్షణ ఉంటుంది.ఈ సమావేశంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మనోహర్, జెడ్.పి.సి.ఇ.ఓ.శోభరాణి , ఏబీడీఎం నోడల్ అధికారి డాక్టర్ సుమన్ కళ్యాణ్, ఏబీడీఎం స్టేట్ ట్రైనర్ సాయి కుమార్,మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖల ప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.