సమస్యల వలయాల్లో భువనగిరి కేజీ బీవీలో నీటి కొరత, అధికారులు వచ్చి వెళుతున్నా - సమస్యలు యథాతథం
భువనగిరి జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం సమస్యలతో సతమతమౌతుంది. సుమారు 300 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్న విద్యాలయంలో నీటి సరఫరాకు సంబంధించిన శాస్వత పరిష్కారం అధికారులు చేయలేక పోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు, బాలల హక్కుల సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో నీటి కొరత తీవ్రంగా ఉందని గుర్తించిన అప్పటి భువనగిరి ఆర్డీవో భూపాల్ రెడ్డి, ప్రభుత్వ నిధులతో బోరు వేయించారు.ఆ బోరు వర్షా కాలంలో సరిపడా నీటిని అందిస్తున్నా,ఎండా కాలంలో మాత్రం నీటి తిప్పలు తప్పడం లేదు. పాఠశాల ప్రారంభమై వారం రోజుల గడుస్తున్నాయి.ఎండలు ఎక్కువగా ఉండడం, వర్షాలు పడకపోవడంతో నీటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు, స్నానాలు చేయడానికి తగినన్ని నీళ్లు లేకపోవడంతో స్నానాలు చేయడం లేదు. ఒకవైపు విపరీతమైన ఎండలు, మరొకవైపు నీటి కొరతతో కొందరు విద్యార్థులు సిక్ లీవ్ పెట్టుకుని ఇళ్ళకు వెళుతున్నారు. మున్సిపల్ అధికారులు ఇందిరమ్మ కాలనీ వాసులకు, మరియు కేజీ బీవీ పాఠశాల కు వేరువేరుగా ట్యాంకర్ల కేటాయించినా అవి సక్రమంగా నీటి సరఫరా చేయడం లేదని ఆరోపణలు వినబడుతున్నాయి. మండల స్థాయి అధికారుల నుంచి జిల్లా కలెక్టర్ వరకు అనేక మంది అధికారులు పాఠశాల పర్యవేక్షణ పేరుతో సందర్శించినా, నీటి సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బాలికలకు నీటి వసతి కల్పించాలని బాలికలు, బాలల హక్కుల సంఘం నాయకులు కోరుతున్నారు.