పర్వతాపురంలో నేడు మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన
చాట్రాయి మండల రిపోర్టర్ గోళ్ళ సత్యనారాయణ
ఏలూరు జిల్లా, జూలై 9: ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గురువారం (జూలై 9) పర్యటించనున్నట్లు చాట్రాయి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు తెలిపారు.
ఈ సందర్భంగా ఉదయం 11 గంటలకు నిర్వహించే రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుబుక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు పాసుబుక్కులు అందజేయనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) కింద ఎంపికైన 24 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.9 లక్షల విలువైన ఆర్థిక సహాయ చెక్కులను పంపిణీ చేయనున్నారు.
అదేవిధంగా దివ్యాంగుల సంక్షేమం కోసం ట్రైసైకిళ్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ఉమ్మడి కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని చాట్రాయి టీడీపీ మండల అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు.