పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ… అమెరికా భారీ బలగాల మోహరింపు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ… అమెరికా భారీ బలగాల మోహరింపు
పశ్చిమాసియాలో ఇరాన్తో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో అమెరికా తన సైనిక బలగాలను వేగంగా పెంచుతోంది. ఈ క్రమంలో అత్యాధునిక యుద్ధనౌక యూఎస్ఎస్ ట్రిపోలి ఆ ప్రాంతానికి చేరుకుంది.
ఈ యుద్ధనౌకలో సుమారు 2,500 మంది మెరైన్ సైనికులు ఉండగా, వీరి రాకతో ఆ ప్రాంతంలో అమెరికా అదనంగా మోహరించిన బలగాల సంఖ్య 3,500 దాటింది. ఈ విషయాన్ని యూఎస్ సెంట్రల్ కమాండ్ అధికారికంగా వెల్లడించింది.
యూఎస్ఎస్ ట్రిపోలి అత్యాధునిక సామర్థ్యాలతో రూపొందించబడిన నౌక. దీనిపై ఎఫ్-35 ఫైటర్ జెట్లు సహా పలు యుద్ధ విమానాలను మోహరించే సామర్థ్యం ఉంది. అవసరమైతే వేగంగా దాడులు జరిపేలా, అలాగే వ్యూహాత్మకంగా బలగాలను తరలించేలా ఇది ఉపయోగపడుతుంది.
ప్రస్తుతం ఈ పరిణామం పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులపై మరింత ఆందోళనను పెంచుతోంది. ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకునే అవకాశముందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.