రాజధాని చట్టబద్ధత బిల్లుకు మద్దతుగా ఘన సమావేశం
ద్రావిడ విశ్వవిద్యాలయంలో అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లుకు మద్దతుగా ఘన సమావేశం
ద్రావిడ విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో, అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంటులో ఆమోదం లభించిన సందర్భంగా గురువారం ఘన సమావేశం నిర్వహించబడింది. లోక్సభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2026 ఆమోదం పొందడం రాష్ట్ర చరిత్రలో ఒక విశిష్ట ఘట్టమని పలువురు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా ద్రావిడ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎల్ .సి. మల్లయ్య మాట్లాడుతూ,
“అమరావతి అంటే కేవలం ఒక నగరం మాత్రమే కాదు; అది వేలాది మంది రైతుల త్యాగాల ఫలితం. అభివృద్ధికి, ఆర్థిక పురోగతికి బలమైన పునాది. తమ భూములను వేల ఎకరాల మేర సమర్పించి, అమరావతి కోసం దీర్ఘకాలంగా పోరాడి విజయం సాధించిన రైతులు అభినందనీయులు” అని పేర్కొన్నారు.
ఇప్పుడు అమరావతి రాజధాని దేశవ్యాప్తంగా గౌరవప్రదమైన గుర్తింపును సంపాదించుకుందని, ఈ చట్టం అమలులోకి రావడంతో రాష్ట్ర పరిపాలనలో స్థిరత్వం ఏర్పడుతుందని, పెట్టుబడిదారుల నమ్మకం మరింత పెరుగుతుందని, ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని, రాష్ట్ర అభివృద్ధి వేగవంతమవుతుందని ఆయన తెలిపారు. ఈ బిల్లు పరిపాలనా స్పష్టతను కల్పించి పెట్టుబడులకు అనుకూల వాతావరణం సృష్టిస్తుందని కూడా తాజా నివేదికలు సూచిస్తున్నాయి.
అలాగే, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు, ముఖ్యంగా అమరావతి రైతులకు ద్రావిడ విశ్వవిద్యాలయం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వి.కిరణ్ కుమార్, అకాడమిక్ అఫైర్స్ డీన్ ఆచార్య కె. శ్యామల, వివిధ శాఖల పీఠాధిపతులు, శాఖాధికారులు, బోధనేతర సిబ్బంది, పరిశోధక విద్యార్థులు మరియు విద్యార్థులు ఘనంగా పాల్గొన్నారు.
డా.పి.ఎస్.గణేష్ మూర్తి పిఆర్ఓ ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం.