పుంగనూరు ప్రధాన రహదారి మరమ్మతుల కోసం దీక్ష – ప్రతి ఒక్కరూ తరలిరావాలని CPI పార్టీ పిలుపు.
పుంగనూరు | NTODAY NEWS
అన్నమయ్య జిల్లా పుంగనూరు నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రధాన రహదారి అసంపూర్తిగా ఉండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు అనేది ప్రతి ఒక్కరి కనీస అవసరమని, దాని దుస్థితి ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిందని పేర్కొన్నారు.
ఈ రహదారిపై గతంలో జరిగిన ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటనను గుర్తు చేస్తూ, ఇప్పటికీ శాశ్వత మరమ్మతులు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు, భక్తులు ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తెలిపారు.
గత నెల రోజులుగా రోడ్డు మరమ్మతుల కోసం ఆర్ అండ్ బీ (R&B) అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, నామమాత్రపు పనులతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. పూర్తి స్థాయిలో రహదారి మరమ్మతులు చేపట్టి ప్రజలకు సురక్షిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేశారు.
బుధవారం లోగా రోడ్డు పనులను పునఃప్రారంభించి మరమ్మతులు చేపట్టకపోతే భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి పుంగనూరు నియోజకవర్గ ప్రజలు, వాహనదారులు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.