రాజవరం, పెనుగొలనులో ఘనంగా పింగళి వెంకయ్య 150వ జయంతి వేడుకలు
రాజవరం, పెనుగొలనులో ఘనంగా పింగళి వెంకయ్య 150వ జయంతి వేడుకలు
గంపలగూడెం: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలోని రాజవరం గ్రామంలో జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాజీ గ్రామ సర్పంచి అబ్బూరి వెంకటయ్య మాట్లాడుతూ పింగళి వెంకయ్య గొప్ప దేశభక్తుడని, స్వాతంత్య్ర ఉద్యమంలో వందేమాతరం, హోం రూల్ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారని తెలిపారు. దేశానికి ప్రత్యేక జాతీయ పతాకం అవసరమనే సంకల్పంతో 1916లో "భారతదేశానికి ఒక జాతీయ పతాకం" అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించారని వివరించారు.
గాంధీ సూచనల మేరకు కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో మధ్యలో రాట్నం గుర్తు ఉన్న జాతీయ పతాకాన్ని పింగళి వెంకయ్య రూపొందించారని, 1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో ఆ పతాకాన్ని ఆవిష్కరించారని చెప్పారు. స్వాతంత్య్రం అనంతరం రాట్నం స్థానంలో అశోక చక్రాన్ని చేర్చి ప్రస్తుత జాతీయ పతాకాన్ని అమల్లోకి తీసుకువచ్చారని పేర్కొన్నారు.
విశ్వహిందూ పరిషత్ జిల్లా సమన్వయకర్త అన్నవరపు క్రాంతి కుమార్ మాట్లాడుతూ పింగళి వెంకయ్య జాతీయ పతాక రూపకర్త మాత్రమే కాకుండా పురాతన నాణేలు, భూగర్భ శాస్త్రం, వ్యవసాయం వంటి అనేక రంగాల్లో పరిశోధనలు చేసి పుస్తకాలు రచించిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు.
మాజీ సర్పంచి చెన్నుపాటి నరసింహారావు మాట్లాడుతూ కృష్ణా జిల్లా భట్లపెనుమర్రులో 1876 ఆగస్టు 2న జన్మించిన పింగళి వెంకయ్య తెలుగు వ్యక్తి కావడం ప్రతి తెలుగువారికి గర్వకారణమని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మన్నే నరసింహమూర్తి, బండారుపల్లి వెంకట నరసయ్య, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు నేరెళ్ల యుగంధర్, సత్యసాయి సేవా కమిటీ సభ్యులు పారేపల్లి కృష్ణారావు, వై. జగన్నాథం, తొండపు శ్రీను, సుగ్గల ప్రసాద్, గ్రామస్తులు పాల్గొన్నారు.
పెనుగొలనులో వేడుకలు
గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో శిరిడి సాయిబాబా యూత్ కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు వూటుకూరు యజ్ఞ కృష్ణ అధ్యక్షతన పింగళి వెంకయ్య 150వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యం, మూడు రంగుల విశిష్టతను వివరించారు. అనంతరం గ్రామస్తులకు మిఠాయిలు పంపిణీ చేసి జాతీయ పతాకానికి గౌరవం కాపాడాలని పిలుపునిచ్చారు.