రాళ్లవాగుపై భారీ వంతెన నిర్మాణం వెంటనే నిలిపివేయాలి
సన్సిటీ కాలనీ ప్రజల నిరసనకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మద్దతు
బ్రిడ్జి వల్ల 200 కుటుంబాలకు రోడ్డు సౌకర్యం దూరం.. పనులు ఆపకుంటే మున్సిపల్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరిక
మంచిర్యాల పట్టణం అమరవీరుల స్థూపం వద్ద రాళ్ళవాగుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న 100 ఫీట్ల వెడల్పు (6 లేన్) పై వంతెన నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సన్సిటీ కాలనీ ప్రజలు నిరసన చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి హాజరై కాలనీవాసులకు పూర్తి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాళ్లవాగుపై భారీ ఎత్తున బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం వల్ల సన్సిటీలో నివాసం ఉంటున్న 200కు పైగా కుటుంబాలకు రోడ్డు సదుపాయం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఇంత పెద్ద వంతెన అవసరం లేకపోయినా ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తోందని ఆయన మండిపడ్డారు.
రాళ్లవాగు కాజ్వేపై నూతన వంతెన అవసరమైనప్పటికీ.. స్థానిక కార్మెల్ స్కూల్ వద్ద నిర్మించిన వంతెన తరహాలోనే, అంతే ఎత్తుతో ఇక్కడ కూడా బ్రిడ్జి నిర్మించాలని రఘునాథ్ వెరబెల్లి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనులను ఆపివేసి, స్థానిక కాలనీ ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. ఒకవేళ అధికారులు, ప్రభుత్వం స్పందించకుండా పనులను ఇలాగే కొనసాగిస్తే.. త్వరలోనే బాధితులందరినీ కలుపుకొని మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సన్సిటీ కాలనీ ప్రతినిధులు, బాధితులు మరియు బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు