రేషన్ మాఫియాకు చెక్....
రేషన్ మాఫియాకు చెక్.. బియ్యం బస్తాలకు క్యూ ఆర్ కోడ్ ట్యాగ్లు
అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
అమరావతి: ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇకపై రేషన్ బియ్యం ప్రతి బస్తాకు క్యూ ఆర్ కోడ్ ట్యాగ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విధానం ద్వారా అక్రమంగా పట్టుబడిన రేషన్ బస్తాలు ఏ గోదాము నుంచి వచ్చాయి, ఏ ప్రాంతానికి చెందినవి అనే వివరాలను సులభంగా గుర్తించనున్నారు.
క్యూ ఆర్ కోడ్ విధానాన్ని పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు పరిశీలించారు. రేషన్ పంపిణీకి ముందు డీలర్లు తప్పనిసరిగా బియ్యం బస్తాలను స్కాన్ చేయాల్సి ఉంటుంది. స్కానింగ్ ద్వారా బియ్యం సరఫరా, నిల్వ, పంపిణీ వివరాలను అధికారులు పర్యవేక్షించనున్నారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ క్యూ ఆర్ కోడ్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో మరింత పారదర్శకత తీసుకురావడంతో పాటు అర్హులైన కార్డుదారులకు నాణ్యమైన బియ్యం అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సొంత జిల్లా నుంచి ఈ విధానాన్ని తొలుత అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు.