రైతు నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటూ వీఆర్వో ఏసీబీకి చిక్కిన వైనం
రైతు నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటూ వీఆర్వో ఏసీబీకి చిక్కిన వైనం
గంగవరం గ్రామ సచివాలయంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు
మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలంలో ఘటన
మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం గంగవరం గ్రామ సచివాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. రైతు నుంచి లంచం తీసుకుంటున్న వీఆర్వో మహబూబ్ భాషను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నట్లు సమాచారం.
రైతుకు సంబంధించిన పనిని పూర్తి చేసేందుకు వీఆర్వో రూ.20 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. పక్కా ప్రణాళికతో గంగవరం గ్రామ సచివాలయానికి చేరుకున్న అధికారులు, లంచం సొమ్ము తీసుకుంటున్న సమయంలో వీఆర్వోను పట్టుకున్నట్లు తెలిసింది.
ఏసీబీ అధికారులు లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకుని, ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. వీఆర్వో మహబూబ్ భాషపై కేసు నమోదు చేసి తదుపరి చర్యల ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు సమాచారం.
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి తావులేకుండా చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు పలుమార్లు హెచ్చరిస్తున్నప్పటికీ, కొందరు ఉద్యోగులు లంచాలకు పాల్పడుతూ పట్టుబడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.