రైతుల అనుమతి లేకుండా విల్లా ప్రాజెక్టుకు అనుమతులపై ఫిర్యాదు
రైతుల అనుమతి లేకుండా విల్లా ప్రాజెక్టుకు అనుమతులపై ఫిర్యాదు
మంగళగిరి-తాడేపల్లి కమిషనర్ను ఆశ్రయించిన రైతులు.. అప్రూవల్స్ నిలిపివేయాలని డిమాండ్
తాడేపల్లి: తమ అనుమతి లేకుండానే విల్లా ప్రాజెక్టుకు అనుమతులు పొందారని ఆరోపిస్తూ తాడేపల్లికి చెందిన రైతులు మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వారు కోరారు.
2016-17లో విష్ణు ప్రియా వెంచర్స్ అండ్ డెవలపర్స్ అధినేత అరిమిల్లి రామకృష్ణతో తాము స్వచ్ఛందంగా డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నామని రైతులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎకరానికి నాలుగు విల్లాలు, రూ.25 లక్షల అడ్వాన్స్ చెల్లించే విధంగా ఒప్పందం జరిగిందని తెలిపారు.
అయితే ఒప్పందం కుదిరిన తర్వాత దాదాపు పదేళ్లుగా డెవలపర్ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా కాలయాపన చేశారని రైతులు ఆరోపించారు. తాజాగా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా 90 ఎకరాలకు కార్పొరేషన్లో ఫీజులు చెల్లించి అనుమతులు పొందారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
బీఎస్ఆర్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని చెబుతూ నిర్వహించిన సమావేశంలో రైతుల అభిప్రాయాలు తెలుసుకోకుండా, వెంటనే భూములు ఖాళీ చేయాలని సెక్యూరిటీ సిబ్బందితో ఒత్తిడి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
పదేళ్ల క్రితం కుదిరిన ఒప్పంద నిబంధనల ప్రకారం ప్రస్తుతం ప్రాజెక్టు చేపట్టేందుకు తాము అంగీకరించడం లేదని రైతులు స్పష్టం చేశారు. రైతుల అనుమతి లేకుండా ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని, ఇప్పటికే జారీ చేసిన అప్రూవల్స్ను నిలిపివేయాలని కమిషనర్ను కోరారు.
తాము సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూములను బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని రైతులు డిమాండ్ చేశారు.