రిటైర్డ్ ఉపాధ్యాయుడి ఉదారత.. విద్యార్థులకు 50 గ్లాసుల విరాళం పోలవరం కెపి మోడల్ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి నిరంతర సహకారం
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాల, పోలవరం కెపిలో విద్యార్థులు రాగిజావ తాగేందుకు అవసరమైన 50 స్టీల్ గ్లాసులను అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందిన పగుట్ల ప్రసాదరావు అందజేశారు. పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చేసిన ఈ సేవను ఉపాధ్యాయులు అభినందించారు.
పగుట్ల ప్రసాదరావు గత కొంతకాలంగా పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తూ వస్తున్నారు. జాతీయ పర్వదినాల సందర్భంగా నిర్వహించే క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందించడం, సంక్రాంతి సంబరాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్. నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు పరసా శ్రీనివాసరావు, కారుమంచి దేవి, జక్కం రాజేష్, అలమంటి సిరి పగుట్ల ప్రసాదరావును ఘనంగా అభినందిస్తూ, ఆయన సేవాభావం ఇతరులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.