రంగదాములపల్లె చెరువు సామర్థ్యం పెంపునకు కీలక ముందడుగు
రంగదాములపల్లె చెరువు సామర్థ్యం పెంపునకు కీలక ముందడుగు
జంగల్ నాలా ప్రాజెక్టు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతి
హైదరాబాద్: రంగదాములపల్లె చెరువు నిల్వ సామర్థ్యాన్ని (స్టోరేజీ కెపాసిటీ) పెంచి, కింద ఉన్న గ్రామాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా జంగల్ నాలా ప్రాజెక్టుకు శాశ్వత పరిష్కారం చూపాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్లో రాష్ట్ర నీటిపారుదల (ఇరిగేషన్) శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
నివేదిక అందజేత:
రంగదాములపల్లె చెరువు, జంగల్ నాలా ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను, శాశ్వత పరిష్కారానికి అవసరమైన ప్రతిపాదనలను మంత్రి లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ మంత్రికి అందజేశారు. ఈ ప్రాజెక్టుల ప్రాముఖ్యతను, వీటి వల్ల స్థానిక రైతులకు, ప్రజలకు చేకూరనున్న ప్రయోజనాలను ఆయన వివరించారు. సమస్య పరిష్కారం కోసం తక్షణమే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
సానుకూలంగా స్పందించిన మంత్రి:
మంత్రి లక్ష్మణ్ కుమార్ అందించిన ప్రతిపాదనలను పరిశీలించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో చర్చించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సంబంధిత ఫైలుపై సానుకూల ముందడుగు పడినట్లు సమాచారం. ఈ సమావేశంలో పిసిసి డెలిగేట్, వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాటిపర్తి శైలేందర్ రెడ్డి పాల్గొన్నారు.