రూ.12 లక్షలతో నిర్మించిన ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభం
రూ.12 లక్షలతో నిర్మించిన ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభం
నూజివీడు : నూజివీడు మండలం మర్రిబందం గ్రామంలో సీపీ ఆక్వాకల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సుమారు రూ.12 లక్షల వ్యయంతో నిర్మించిన ఆర్వో వాటర్ ప్లాంట్ను రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మాణానికి సహకరించిన సీపీ ఆక్వాకల్చర్ సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వం, ప్రైవేటు రంగం సమన్వయంతో పనిచేస్తే గ్రామాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఆర్థికంగా స్థిరపడిన కుటుంబాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
మర్రిబందం గ్రామంలో గత రెండేళ్లలో సుమారు రూ.72 లక్షలతో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. వివిధ రంగాలకు చెందిన సంస్థలు, బహుళజాతి కంపెనీలు సామాజిక బాధ్యతతో ముందుకు రావడం శుభపరిణామమని అన్నారు.
ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయవచ్చని, ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో మరింత మంది భాగస్వాములు కావాలని మంత్రి కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీ ఆక్వాకల్చర్ సంస్థ ప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.