రూ.52కే నాణ్యమైన సన్న బియ్యం.. నూజివీడులో మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభం
రూ.52కే నాణ్యమైన సన్న బియ్యం.. నూజివీడులో మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభం
నూజివీడు, ఆగస్టు 4:
సామాన్య ప్రజలకు నాణ్యమైన సన్న బియ్యాన్ని అందుబాటు ధరలో అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంతో నూజివీడు రైతు బజార్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక రైస్ కౌంటర్ను రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల భారం నుంచి పేద కుటుంబాలకు ఉపశమనం కల్పించేందుకు అర్హులైన తెల్ల రేషన్ కార్డుదారులకు కేవలం రూ.52కే నాణ్యమైన సన్న బియ్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని సరసమైన ధరలకు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని పేర్కొన్న మంత్రి, రైతులకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని చెప్పారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను ప్రోత్సహిస్తూ డ్రిప్ ఇరిగేషన్, వ్యవసాయ పనిముట్లపై సబ్సిడీలు అందిస్తున్నామని వివరించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం, ఉచిత గ్యాస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ వంటి సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొస్తున్నాయని తెలిపారు. అలాగే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి రైతుకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
పేద ప్రజల సంక్షేమం, రైతుల అభివృద్ధి, రాష్ట్ర ప్రగతే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. రైతు బజార్లో ప్రారంభమైన ఈ రైస్ కౌంటర్ ద్వారా అర్హులైన వేలాది కుటుంబాలకు నాణ్యమైన సన్న బియ్యం అందుబాటులోకి రానుందని అధికారులు తెలిపారు.