రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి
రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి
- రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ ఆదేశం
- బ్లాక్ స్పాట్లను గుర్తించి ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలి
- జిల్లాలో పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం: కలెక్టర్ కుమార్ దీపక్
జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు, రవాణా, ఆర్అండ్బీ, జాతీయ రహదారుల శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతినెలా జిల్లాస్థాయి రహదారి భద్రతా కమిటీ సమావేశాలు నిర్వహించాలని, టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించేలా అంబులెన్సులను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. అలాగే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించేలా విస్తృత అవగాహన కల్పించాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ.. జిల్లాలోని జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు అన్ని శాఖల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. క్రమం తప్పకుండా భద్రతా కమిటీ సమావేశాలు నిర్వహిస్తూ, ప్రమాదకర ప్రాంతాల్లో (బ్లాక్ స్పాట్స్) రక్షణ ఏర్పాట్లు చేస్తున్నామని ఉన్నతాధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్తో పాటు రవాణా, ఆర్అండ్బీ, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.