రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు
రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు
ఎన్హెచ్-40పై సంయుక్త తనిఖీలకు శ్రీకారం
29 ప్రమాదకర ప్రాంతాల గుర్తింపు - వేగవంతమైన పరిష్కారానికి చర్యలు
నెల రోజుల్లో ‘ప్రమాద రహిత జిల్లా’ లక్ష్యం
జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ
నంద్యాల జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణలో జాతీయ రహదారుల్లో గుర్తించిన బ్లాక్ స్పాట్లపై సంబంధిత అన్ని విభాగాల అధికారులతో కలిసి సంయుక్త తనిఖీ కోసం నిర్వహించిన బస్సు యాత్రను జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPSతో కలిసి జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జాతీయ రహదారులు గుర్తించిన బ్లాక్ స్పాట్లను పరిశీలించారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ నంద్యాల జిల్లాను నెల రోజుల్లో ‘ప్రమాద రహిత జిల్లా’ గా తీర్చిదిద్దేందుకు “బ్లాక్ స్పాట్ పరిశీలన యాత్ర”ను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రమాదాల వల్ల అనేక కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని పేర్కొంటూ, ప్రమాదాల నియంత్రణకు సమగ్ర చర్యలు అవసరమని కలెక్టర్ స్పష్టం చేశారు.
ప్రమాదాల గణాంకాలు
జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గత రెండేళ్లుగా పెరుగుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. 2024 సంవత్సరంలో మొత్తం 542 ప్రమాదాలు సంభవించగా, 271 మంది మృతి చెందారన్నారు. 2025లో ప్రమాదాల సంఖ్య 567కి పెరిగి, మరణాలు 296కి చేరాయన్నారు. ఈ పరిస్థితి పట్ల కలెక్టర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
బ్లాక్ స్పాట్ల గుర్తింపు
జిల్లా వ్యాప్తంగా ప్రమాదాలు అధికంగా జరుగుతున్న 29 బ్లాక్ స్పాట్లను అధికారులు గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. వాటిలో ఎన్హెచ్-40పై 9, ఎన్హెచ్-44పై 7, నంద్యాల పట్టణ పరిధిలో 6, ఎన్హెచ్-340C మరియు 544Dపై కలిపి 7 బ్లాక్ స్పాట్లు ఉన్నాయన్నారు. ఈ బ్లాక్ స్పాట్లను త్వరితగతిన సరిదిద్దేందుకు నేషనల్ హైవేస్, ఆర్ అండ్ బి, పోలీస్, ట్రాన్స్పోర్ట్, ఆర్టీసీ శాఖల మధ్య సమన్వయం పెంచుతున్నట్లు తెలిపారు. వచ్చే ఒక నెలలో గుర్తించిన సమస్యలను పరిష్కరించి, నంద్యాల జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. వాహనదారులు వేగ పరిమితులను తప్పనిసరిగా పాటించాలని, జంక్షన్ల వద్ద అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించడం, ద్విచక్ర వాహనదారులు డ్రైవర్తో పాటు వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని కోరారు.
జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్గా ఈ “బ్లాక్ స్పాట్ పరిశీలన యాత్ర” నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను అధికారులు స్వయంగా పరిశీలించి తక్షణ చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. పోలీస్ శాఖతో పాటు ఆర్ అండ్ బి, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) మరియు టోల్ గేట్ సిబ్బంది కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు. జంక్షన్ల వద్ద వాహనాల వేగాన్ని తగ్గించేందుకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం, ముఖ్య ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చడం, రాత్రి సమయంలో దృశ్యమానత పెంచేందుకు తగిన లైటింగ్ సౌకర్యాలు కల్పించడం వంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వచ్చే ఒక నెలలో అన్ని భద్రతా చర్యలను పూర్తి చేసి, నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడం ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని అధికారులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఏఐ (NHAI) పీడీ బి. అశోక్ కుమార్, ఆర్ఈపీఎల్ (REPL) ప్రాజెక్ట్ హెడ్ మదన్ మోహన్ వంగర, ఆర్ఈపీఎల్ (REPL) ఆపరేషన్ మేనేజర్ శ్రీనివాసులు, ఆర్ఈపీఎల్ (REPL) రూట్ మేనేజర్ నరియేరవారా రెడ్డి, ఆర్ అండ్ బి ఈఈ శ్రీధర్ రెడ్డి, సబ్ డివిజనల్ ఏఎస్పి, ప్రాంతీయ రవాణా అధికారులు, ఆర్టీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయం, నంద్యాల.