సామాజిక బాధ్యతగా అందజేసిన ‘ఎలక్ట్రోస్టీల్ కాస్టింగ్స్’ సంస్థ..
అన్నమయ్య పోలీసులకు ‘డేగ కన్ను’.. అత్యాధునిక డ్రోన్ వితరణ..
నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల అదుపునకు ప్రత్యేకాస్త్రం..
సంస్థ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ..
మదనపల్లె, జూన్ 22: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల అదుపు కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ మరో కీలక అడుగు ముందుకు వేసింది. పోలీసుల విధులను మరింత సులభతరం చేస్తూ, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రముఖ పారిశ్రామిక సంస్థ ‘ఎలక్ట్రోస్టీల్ కాస్టింగ్స్ లిమిటెడ్’ (శ్రీకాళహస్తి వర్క్స్) తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్సార్)లో భాగంగా జిల్లా పోలీసు శాఖకు అత్యాధునిక ‘DJI MAVIC 4 PRO (512 GB) క్రియేటర్’ డ్రోన్ను విరాళంగా అందజేసింది. సోమవారం మదనపల్లెలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ఈ డ్రోన్ను జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ అధికారికంగా అందజేశారు.
*గాల్లోంచి గట్టి నిఘా.. పోలీసులకు ఇక ‘డేగ కన్ను’* ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ.. విధుల్లో సాంకేతికతను జోడించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని, ఈ అత్యాధునిక డ్రోన్ పోలీసు శాఖకు ఒక ‘డేగ కన్ను’లా పనిచేస్తుందని హర్షం వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా జూద స్థావరాలు, బహిరంగ మద్యపానం వంటి అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడ జరిగినా డ్రోన్ టెక్నాలజీతో ఇట్టే పసిగడతామని స్పష్టం చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రద్దీగా ఉండే ప్రాంతాలు, పట్టణ శివార్లు, తోటలు, బహిరంగ ప్రదేశాల్లో తరచూ జరిగే చైన్ స్నాచింగ్స్, ఈవ్ టీజింగ్, దొంగతనాలను నివారించేందుకు ముందుగానే డ్రోన్లతో ఆయా ప్రాంతాలపై గట్టి నిఘా ఉంచుతామని తెలిపారు. ముఖ్యంగా విజిబుల్ పోలీసింగ్, ట్రాఫిక్ నియంత్రణ, వీఐపీల బందోబస్తు సమయాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షించేందుకు, రాత్రి వేళల్లో సుదూర ప్రాంతాల్లో అనుమానితుల కదలికలను గుర్తించేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని ఎస్పీ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సహకారంతో నేర నియంత్రణను మరింత సమర్థంగా నిర్వహిస్తామన్నారు.
సంస్థ యాజమాన్యానికి కృతజ్ఞతలు..సమాజ రక్షణ కోసం పోలీసు శాఖ అహర్నిశలు చేస్తున్న కృషికి తమ వంతు బాధ్యతగా అండగా నిలిచిన ఎలక్ట్రోస్టీల్ కాస్టింగ్స్ లిమిటెడ్ యాజమాన్యాన్ని, వారి సామాజిక దృక్పథాన్ని ఎస్పీ గారు ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకటాద్రి గారితో పాటు, ఎలక్ట్రోస్టీల్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సురేష్ కండేల్ వాల్, సీనియర్ జనరల్ మేనేజర్ శ్రీ దొరై రాజు, సంస్థ పీఆర్వో శ్రీ అభిషేకం తదితరులు పాల్గొన్నారు.