సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి: ఎమ్ఎల్హెచ్పీ లావణ్య
ఏలూరు జిల్లా కొవ్వూరు గూడెంలో 104 మొబైల్ హెల్ప్లైన్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఎమ్ఎల్హెచ్పీ లావణ్య, హెల్త్ అసిస్టెంట్ బాలరాజు సూచించారు. స్థానిక కొవ్వూరు గూడెంలో 104 మొబైల్ హెల్ప్లైన్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలంలో దోమల బెడద అధికమవుతుందని, దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
డ్రైనేజీల వద్ద ఆయిల్ బాల్స్ వేయడం ద్వారా దోమల గుడ్లను నాశనం చేయవచ్చని తెలిపారు. రాత్రి వేళల్లో నిద్రించే సమయంలో తప్పనిసరిగా దోమతెరలు ఉపయోగించాలని సూచించారు. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) ఝాన్సీ, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.