సీఎం సహాయ నిధి చెక్కులతో పేద కుటుంబాలకు ఊరట..
సీయం సహాయ నిధి నుంచి రూ.10 లక్షల చెక్కుల పంపిణీ పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు
చాట్రాయి: సీఎం సహాయ నిధి చెక్కులతో పేద కుటుంబాలకు ఊరట.. రూ.10 లక్షల సాయం పంపిణీ
పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట.. మంత్రి పార్థసారథి చొరవతో వైద్య సాయం
చాట్రాయి, ఆగస్టు 21: అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని చాట్రాయి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి కింద రూ.10 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు ఆయన వెల్లడించారు.
నూజివీడులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మంత్రి కొలుసు పార్థసారథి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పేదల ఆరోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ఖరీదైన వైద్య చికిత్సలు చేయించుకునే స్థోమత లేని కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఒక భరోసాగా మారిందని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందని ప్రత్యేక పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందన్నారు.
మంత్రి పార్థసారథి నూజివీడు నియోజకవర్గంలోని ప్రతి పేద కుటుంబానికి మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తున్నారని చెప్పారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
నూజివీడు నియోజకవర్గంలో ఇప్పటికే సీఎం సహాయ నిధి ద్వారా అనేక మంది పేదలకు కోట్లాది రూపాయల వైద్య సాయం అందిందని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. పేదల కన్నీళ్లు తుడిచి, ఆపద సమయంలో అండగా నిలిచే విధంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.