సిఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి
- గడువు దాటితే ఇతర మిల్లులకు ధాన్యం తరలింపు
- రైస్ మిల్లులు, తహసీల్దార్ కార్యాలయాలను తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు
జిల్లాలో పెండింగ్లో ఉన్న కస్టమ్ మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) బకాయిలను తక్షణమే పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అధికారులను, మిల్లర్లను ఆదేశించారు. గురువారం ఆయన జన్నారం, దండేపల్లి మండలాల్లోని పలు రైస్ మిల్లులను స్థానిక తహసీల్దార్లతో కలిసి పరిశీలించారు. 2025–26 వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి సిఎంఆర్ పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లుల యాజమాన్యాలతో మాట్లాడుతూ.. నిర్దేశిత గడువులోగా సిఎంఆర్ను పూర్తి చేయని పక్షంలో, ఆ ధాన్యాన్ని మెరుగైన పనితీరు కనబరిచే ఇతర రైస్ మిల్లులకు తరలించేలా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అనంతరం జన్నారం, దండేపల్లి తహసీల్దార్ కార్యాలయాలను అదనపు కలెక్టర్ సందర్శించి ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. కార్యాలయాల్లోని సాదాబైనామా, భూ భారతి, రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల ప్రస్తుత స్థితిగతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రికార్డుల ప్రకారం 60 రోజులకు పైగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే, ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, పెండింగ్ పనులన్నింటినీ గడువులోగా పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులకు ఆయన స్పష్టం చేశారు