సమృద్ధిగా ఎరువులు.. సజావుగా సరఫరా ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా పారదర్శక పంపిణీ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశా
తిరువూరు, జూలై 30:
ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన ఎరువులు ఎలాంటి కొరత లేకుండా సకాలంలో అందేలా జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. అన్నదాతల అవసరాలకు అనుగుణంగా పారదర్శక విధానంలో ఎరువుల పంపిణీ జరుగుతోందని చెప్పారు.
గురువారం తిరువూరులో ఎరువులు, పురుగుమందుల దుకాణాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, ఎరువుల నిల్వలు, సరఫరా పరిస్థితి, రైతులకు అందుతున్న సేవలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం జిల్లాలో మొత్తం 8,185 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. ఇందులో పీఏసీఎస్ల వద్ద 3,319 మెట్రిక్ టన్నులు, ప్రైవేటు ఎరువుల విక్రేతల వద్ద 4,866 మెట్రిక్ టన్నులు నిల్వ ఉన్నట్లు చెప్పారు. అలాగే పీఏసీఎస్ల వద్ద 816 మెట్రిక్ టన్నులు, ప్రైవేటు విక్రేతల వద్ద 773 మెట్రిక్ టన్నుల డీఏపీ అందుబాటులో ఉందన్నారు.
ఏ రైతూ ఇబ్బంది పడకుండా పంట అవసరాలకు అనుగుణంగా ఎరువులు సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఏపీ వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ (ఏపీ ఎయిమ్స్) యాప్ ద్వారా ఎరువుల పంపిణీతో పాటు సమగ్ర వ్యవసాయ సేవలు అందిస్తున్నామని వివరించారు.
ఎరువుల సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా జిల్లా, క్షేత్రస్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారని తెలిపారు. మండల వ్యవసాయ అధికారులు ప్రతిరోజూ రెండు నుంచి మూడు ఎరువుల దుకాణాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. యూరియా సమతుల్య వినియోగం, నానో ఎరువులు, డ్రోన్ స్ప్రేయింగ్, పంట వైవిధ్యంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
ఎరువుల అక్రమ రవాణా నివారణకు సరిహద్దు చెక్పోస్టులు ఏర్పాటు చేసి ప్రత్యేక బృందాలతో పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని తెలిపారు. ఎరువుల సరఫరా లేదా వ్యవసాయ సంబంధిత సమస్యలు ఎదురైతే రైతులు కాల్ టు కలెక్టర్ – 91549 70454కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
అనంతరం కలెక్టర్ తిరువూరు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సరిహద్దు చెక్పోస్టును సందర్శించి రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తిరువూరు ఆర్డీవో ఎ. కుమార్, తహసీల్దార్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.