స్వాతంత్య్ర సమరయోధుడు గాదె చిన్నపరెడ్డి వర్ధంతి నిర్వహణ
స్వాతంత్య్ర సమరయోధుడు గాదె చిన్నపరెడ్డి వర్ధంతి నిర్వహణ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో తొలి తరం స్వాతంత్య్ర సమరయోధుడు గాదె చిన్నపరెడ్డి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో గాదె చిన్నపరెడ్డి చేసిన త్యాగాలు చిరస్మరణీయమని తెలిపారు. 1909 ఫిబ్రవరి 18న శివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా కోటప్పకొండకు 60 అడుగుల ప్రభను ఎడ్లబండిపై తీసుకెళ్లిన సంఘటనను గుర్తు చేశారు.
ఆ సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో ఎద్దులు అదుపు తప్పాయని, అదే అవకాశంగా భావించిన బ్రిటిష్ పోలీసులు ఎద్దులను తుపాకులతో కాల్చి చంపారని తెలిపారు. అనంతరం చిన్నపరెడ్డిని అరెస్టు చేయడంతో ఆయన విడుదల కోసం, పరాయి పాలనకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున వందేమాతరం నినాదాలు చేశారని పేర్కొన్నారు.
ఈ క్రమంలో బ్రిటిష్ పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారని, ఘటనలో ఇద్దరు పోలీసు సిబ్బంది కూడా మృతి చెందారని వివరించారు. అనంతరం బ్రిటిష్ ప్రభుత్వం 1910 ఆగస్టు 14న గాదె చిన్నపరెడ్డికి ఉరిశిక్ష అమలు చేసిందని తెలిపారు.
దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల సేవలను నేటి తరాలు ఎప్పటికీ గుర్తుంచుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాన్వెంట్ ప్రిన్సిపాల్ తోట నాగరాజు, మహిళా కమిటీ సభ్యులు, గ్రామస్తులు, అంగన్వాడి చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.