శోభన్ బాబు సతీమణి శాంతకుమారి కన్నుమూత
హైదరాబాద్, జులై 10: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ దివంగత నటుడు శోభన్ బాబు సతీమణి శాంతకుమారి గురువారం రాత్రి కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
శాంతకుమారి మరణవార్తతో సినీ అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం చెన్నైలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
శోభన్ బాబు, శాంతకుమారి దంపతులు 1958 మే 15న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
కుటుంబ కథా చిత్రాలు, ప్రేమకథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన శోభన్ బాబు, దక్షిణ భారత సినీ పరిశ్రమలో అగ్రనటుడిగా విశేష గుర్తింపు పొందారు. "చివరి వరకు హీరోగానే గుర్తుండాలనే" తన సంకల్పంతో కెరీర్ చివరి దశలో అనేక సినిమా అవకాశాలను కూడా ఆయన తిరస్కరించారు. శాంతకుమారి మరణంతో శోభన్ బాబు కుటుంబాన్ని సినీ అభిమానులు, ప్రముఖులు సంతాప సందేశాలతో పరామర్శిస్తున్నారు.