నార్కెట్పల్లిలో అఖిలపక్ష బంద్ విజయవంతం
నల్గొండ జిల్లా నార్కెట్పల్లి పట్టణంలో రోడ్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ చిరుమర్తి యాదయ్య అధ్యక్షతన జరిగిన ఈ బంద్కు ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా మద్దతు తెలిపి దుకాణాలు మూసివేశారు. అనంతరం బస్టాండ్ సమీపంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా నాయకులు రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, మాజీ ఎంపీపీ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ... గత ప్రభుత్వ హయాంలో రూ.16 కోట్లతో మంజూరైన రోడ్డు పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. గతంలో జరిగిన పనులకే ఇప్పుడు శిలాఫలకాలు వేస్తున్నారే తప్ప, కొత్త అభివృద్ధి పనులేవీ చేయడం లేదని ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు వివిధ పార్టీల స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.