చింతలపూడిలో హోంవర్క్ చేయలేదని పదో తరగతి విద్యార్థులపై ఉపాధ్యాయుడి దౌర్జన్యం
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా చింతలపూడిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులపై హిందీ ఉపాధ్యాయుడు దౌర్జన్యంగా వ్యవహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హోంవర్క్ పూర్తి చేయలేదనే కారణంతో విద్యార్థులను ఇష్టారీతిన హింసించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
విద్యార్థుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయుడి తీరుపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువు పేరుతో విద్యార్థులపై శారీరకంగా, మానసికంగా ఒత్తిడి చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. పాఠశాలలో వేల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ విద్యార్థుల భద్రత, సంక్షేమంపై తగిన శ్రద్ధ చూపడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
హోంవర్క్ చేయలేదనే కారణంతో విద్యార్థులను హింసించడం వంటి ఘటనలను ఉపేక్షించకూడదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు విద్యాశాఖ అధికారులను కోరుతున్నారు.
పాఠశాల యాజమాన్యం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంది, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటనే విషయాలపై విద్యాశాఖ అధికారులు వెంటనే దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.