తెలంగాణ లో ప్రతి సోమవారం మండల కేంద్రంలో మండల ప్రజావాణి
తెలంగాణ లో ప్రతి సోమవారం మండల కేంద్రంలో ‘మండల ప్రజావాణి’
ప్రజా సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త వ్యవస్థ
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఫిర్యాదుల స్వీకరణ
హైదరాబాద్, ఆగస్టు 4 : గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసి, వారి సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మండల స్థాయిలో ‘మండల ప్రజావాణి’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ మేరకు ప్లానింగ్ (వి) శాఖ జీవో ఎంఎస్ నెం.4ను జారీ చేసింది.
జీవో ప్రకారం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కార్యాలయంలో మండల ప్రజావాణి నిర్వహించనున్నారు. ఎంపీడీవో ఈ కార్యక్రమానికి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు.
మండల తహసీల్దార్, ఎంపీవో, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్యశాఖ అధికారులు, ఎంఈఓ, వైద్యాధికారి, సీడీపీవో, గృహనిర్మాణ శాఖ, గ్రామీణ నీటి సరఫరా, రోడ్లు–భవనాలు, అటవీ, విద్యుత్ శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్ తదితర శాఖల అధికారులు ప్రజావాణికి తప్పనిసరిగా హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించి తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.
ప్రజలు అందజేసే ప్రతి ఫిర్యాదును ప్రజావాణి పోర్టల్లో నమోదు చేసి, సంబంధిత దరఖాస్తుదారునికి గ్రీవెన్స్ ఐడీతో కూడిన రసీదు అందజేయాలని స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రతి మండల కేంద్రంలో కంప్యూటర్, స్కానర్, ఇంటర్నెట్ సౌకర్యాలతో ప్రత్యేక నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది.
అలాగే వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు, చిన్నారులతో వచ్చిన మహిళలకు ఫిర్యాదుల స్వీకరణలో ప్రాధాన్యత ఇవ్వాలని జీవోలో పేర్కొంది. ప్రస్తుతం జిల్లా, రెవెన్యూ డివిజన్ స్థాయిలో అమలులో ఉన్న ప్రజావాణి విధానాలు మండల ప్రజావాణికీ వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రజలు జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే తమ సమస్యలను మండల స్థాయిలోనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం పొందే అవకాశం కలగనుంది.